ఆర్.నారాయణమూర్తి నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన `అన్నదాత సుఖీభవ` చిత్రాన్ని జులై 7న పునః విడుదల చేయనున్నారు. ఆ విషయం ప్రకటించడానికి గురువారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఇదే వేదికపై `అన్నదాత సుఖీభవ` ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. దీనికి కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``30 ఏళ్లుగా సమస్యల కోసం పోరాడే ప్రజల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను. నా ప్రతి విజయంలోనూ ప్రజా కవుల సహకారం ఉంది. 1995 నుంచి 2018 వరకు 3 లక్షల 25వేల మంది రైతులు ఆత్మహత్యులు చేసుకున్నారు. ఆత్మహత్యలు ఆపాలని నా వంతుగా చేసిన ప్రయత్నమే అన్నదాత సుఖీభవ. అన్నం పెట్టే రైతు బతుకుపోరే ఈ సినిమా. పాలకులు రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి. జయతి ఘోష్, రాధాకృష్ణన్ కమిషన్, స్వామినాథన్ కమిషన్లను ప్రభుత్వం ఆ ప్రయత్నంలో భాగంగానే నియమించింది. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. వారు చెప్పింది అమలైతే రైతుకు జీవితంలో మంచి జరుగుతుంది. రైతుల సగటు ఆదాయం నెలకు రూ.2వేలుగా ఉంది. అది పెరగాలి. రూ.70వేలు వాళ్లకు రావాలి. ఆ మేరకు రైతులకోసం భీమాలు ఏర్పాటు చేయాలి. రైతుల కోసం యూనిట్లను ప్రవేశపెట్టాలి. రైతు పంటలకు భీమాలను కల్పించాలి. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కృషి చేస్తున్నారు. ఆయన మిగిలిన సీఎంలను కలుపుకొని స్వామినాథన్ సిఫారసులు అమలయ్యేలా కృషి చేయాలి`` అని అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ``నా దృష్టిలో జగపతిబాబు, రాఘవ, రామోజీరావు, రాఘవేంద్రరావువంటి కొందరు గొప్పవాళ్లున్నారు. వాళ్లందరిలోని లక్షణాలు నాకు ఆర్. నారాయణమూర్తిలో కనిపిస్తాయి. ఆర్.నారాయణమూర్తి నిరాడంబరమైన వ్యక్తి. ఆయనకు భార్యా, బిడ్డలు లేరు. ప్రతి పైసానూ సమాజం కోసమే ఆయన వెచ్చిస్తారు. ప్రపంచం గురించి విపరీతమైన జ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తి సినిమాల్లో చేసింది చాలు అని భావించి, క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలి. ఆయన ద్వారా ప్రజలకు మరింత లాభం చేకూరుతుంది`` అని అన్నారు.
గద్దర్ మాట్లాడుతూ ``సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న తరుణమిది. ఇండియాలో 20-35 ఏళ్లున్న యువతను మరో వైపు ఈ దండయాత్ర తీసుకెళ్తోన్న తరుణమిది. ఔను- కాదు అనే అంశాల మధ్య జరిగే సంఘర్షణే జీవితం. ఈ శరీరానికి అన్నం కావాలి. వ్యవసాయం అనేది ఒక ఊరిని సమన్వయం చేస్తుంది. భూమి, రైతు, పనిముట్లు, వెట్టివాళ్లు అంతా కలిసిందే ఊరు. రైతంటే ఎవరని ప్రశ్నించే పాలకులకు సమాధానమే `అన్నదాత సుఖీభవ`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్, రాజేంద్రకుమార్, సుద్ధాల అశోక్ తేజ, మాధవ్ తదితరుల పాల్గొన్నారు.