హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్.ఆర్.జనార్దన్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'శుభలేఖ+లు. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లు. ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రాన్ని బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేది ప్రకటిస్తూ సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా...
నిర్మాత ఆర్.ఆర్.జనార్ధన్ మాట్లాడుతూ - ''కంటెంట్ను నమ్మి చిన్న సినిమా ప్రారంభించాం. నేడు పాత్రికేయుల కారణంగా సినిమాకు మంచి హైప్ వచ్చింది. సినిమా చూసిన బెల్లం రామకృష్ణారెడ్డిగారు థియేట్రికల్, శాటిలైట్ హక్కులను కోనుగోలు చేశారు. సినిమాను ఆయనే విడుదల చేస్తున్నారు. అలాగే మా సినిమా హీరో సాయి పుట్టినరోజు తనకు అభినందనలు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''నిర్మాత జనార్ధన్గారు కుటుంబ సమేతంగా సినిమా చూడమని నన్ను ఆహ్వానిస్తే.. ఈ మధ్య విడుదలవుతున్న చిత్రాల్లో చాలా వరకు కుటుంబంతో కలిసి చూసేలా లేదు. దాంతో నేను ఒక్కడినే సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఓ ఫ్రేమ్ కూడా అశ్లీలతగా అనిపించదు. కుటుంబంతో కలిసి చూసేలా ఉండే సినిమా. ఎక్సలెంట్, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే. రాధాకృష్ణగారి మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లింది. ఏడాదిలో వచ్చే ఒకట్రెండు మంచి సినిమాలుంటే.. ఈ ఏడాది ఆ లిస్టులో మా శుభలేఖ+లు ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. డిసెంబర్ 7న సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కె.ఎం.రాధాకృష్ణ మాట్లాడుతూ - ''నాకు జనార్ధన్గారితో ఆనంద్ సినిమా కంటే ముందు నుండి తెలుసు. ఆయన 20ఏళ్ల తపనే ఈ సినిమా. చక్కటి కథ రాశారు. దర్శకుడు దాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి కుటుంబం మనకూ ఉంటే బావుంటుందనిపిస్తుంది. రీరికార్డింగ్కి 23 రోజుల పట్టింది. సినిమా చాలా బాగా వచ్చింది'' అన్నారు.
దర్శకుడు శరత్ నర్వాడే మాట్లాడుతూ - ''కాంటెంపరరీ క్యారెక్టర్స్ ఉంటాయి. యూత్కు రిలేట్ అయ్యేలా ఉంటాయి. యూత్ను పెద్దలు ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ కూడా సినిమాలో ఉంటుంది. నిర్మాతలు చక్కటి సపోర్ట్ అందించారు. మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రాధాకృష్ణగారి సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లింది'' అన్నారు.
హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - ''నాకు అవకాశం రావడానికి శరత్గారే కారణం. ఆయన మేలు మరచిపోలేను. మన అనుబంధాలను గుర్తు తెచ్చుకునేలా ఉంటుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియా వడ్లమాని కూడా పాల్గొన్నారు.