pizza
Smita Rally for Rivers song launch
శ్రీమతి స్మిత మరియు శ్రీ అనంత్ శ్రీరామ్ కలిసి ఒక అద్భుతమైన పాటతో "కావేరి" పిలుపుకు తమ మద్దతు తెలిపారు
You are at idlebrain.com > News > Functions
Follow Us


15 September 2019
Hyderabad

 

కావేరి నదిని పునరుద్ధరించడానికి ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ 'కావేరి పిలుపు' ఉద్యమాన్ని ప్రారంభించారు. రాబోయే 12 ఏళ్లలో ఈ ఉద్యమంలో భాగంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కావేరి పరీవాహక ప్రాంతాల్లో నదుల చుట్టూ 242కోట్ల మొక్కలునాటాలని జగ్గీ వాసుదేవ్‌ నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే మద్దతు తెలిపారు.కావేరి నదికి జీవకళను తీసుకొచ్చి పంట భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కూడగట్టేందుకు 'కావేరి పిలుపు' అనే పాటతో జగ్గీ వాసుదేవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ప్రముఖ గేయ రచయిత అనంతశ్రీరామ్, ప్రముఖ గాయని స్మిత పాటను రూపొందించి తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చారు.మొక్కల పెంపకం ద్వారా వాన నీటిని సంరక్షించుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు రూపొందించిన పాటను తాజాగా హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..

దేనినైనా కాపాడుకోవాలి అని చెప్పడం తేలికే కానీ పరిష్కారాన్ని చూపడమే నాయకుడి లక్షణం. అటువంటి పరిష్కారాన్ని చూపిన నాయకుడిని అనుసరించడం మన బాధ్యత.భారతదేశంలో ఉన్న అడుగంటిపోతున్న నదులను చూసి మొట్టమొదటిసారి కన్నీరు కార్చిన వ్యక్తి సద్గురు జగ్గీ వాసుదేవ్.. ఆ కన్నీరు నేలలో ఇంకిపోకుండా ఆ కన్నీటికి ఒక బాష్యాన్ని వెతికి, ఆ బాష్యానికి ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణకు ఒక ఫలితాన్ని ఊహించి ఈఫలితం ఇలా ఉండబోతుంది. కాబట్టి అందరూ నడుం బిగించండి అని చెప్పి ర్యాలీ ఫర్ రివర్ అనే మహత్తర కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపును మనం విజయవంతంగా భారతీయుల హృదయాలకు చేరవేశాం.. ఆ పిలుపు ఆలోచన దశే.. ఆ ఆలోచన దశనుఆచరణలో పెట్టి కావేరీ నదిని పునరుద్ధరింపజేయడానికి నడుం బిగించారు. ఆయన పూనుకున్న పనికి ప్రతీ ఒక్కరూ సహకరించాలనే ఉద్ధేశ్యంతో పాటను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే దేశంలో ఇన్ని నదులు ఉండగా సద్గురు కావేరీ నదినే ఎందుకు తీసుకున్నారు అనే విషయంపై కొందరికి అనుమానాలు ఉన్నాయని, ఆయన మైసూరులో పుట్టి పెరగడం వల్ల ఆయనకు కావేరి మీద మమకారం ఎక్కువ అని అందరూ అనుకుంటున్నారని, కానీ గోదావరి 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.. కృష్ణా నది 1400కిలో మీటర్లు ప్రవహిస్తుంది.. గంగా నది2500 కిలో మీటర్లు ప్రవహిస్తుంది.. కావేరి 805 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. ముందుగా కావేరిని కాపాడుకుంటే తర్వాత మిగిలిన వాటిని కాపాడుకోవచ్చుననే ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు. ఈ నదిని కాపాడి జీవనవాహినిగా చేశాం అని చూపెట్టడంకోసమే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు. ఆయనకు మన సహకారం అందిస్తే.. మనకు మనం మేలు చేసుకున్నట్లు అవుతుందని అనంత శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. కావేరీని కాపాడుకుంటే మన గోదావరి కృష్ణ కూడా కాపాడుకోవడానికి ఒక అడుగు వేసిన వాళ్లంఅవుతామని ఆయన అన్నారు. అందుకే పాటలో కూడా 'గోదావరి కృష్ణమ్మల తోబుట్టువు కాదా? తనకొచ్చిన కష్టం రేపు మనకు రాదా?' అనే చరణం నాలుగు లైన్లు రాశానని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్లను నాటగలిగితే.. చెట్లు నీటిని తీసుకుంటాయని, ఇన్నాళ్లు చెట్లనునీటికి వనరుగా చూశాం అని ఇప్పడు నదిని కాపాడుకునేందుకు చెట్లను పెంచాలని అన్నారు. చెట్టుకు రూ.42 మనం సహకారం చేస్తే.. చెట్టును నాటడానికి, పెంచడానికి అవి ఉపయోగిస్తారని, హైదరాబాద్ లాంటి నగరంలో యాచకుడి కూడా ఒక చెట్టుని పెంచవచ్చుననిఅనంతశ్రీరామ్ చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమం తెలుగు వాళ్లకు ఎందుకు వెళ్లలేదు అని అందుకే ఇందుకు పాట ఉంటే బాగుంటుందని, పాట రాసినట్లు అనంత శ్రీరామ్ చెప్పారు. పాట అయితే రాయగలిగా కానీ పాట అనే పాపకు స్మిత లాంటి మాట తోడై ఇప్పుడువిడుదలవుతుందని అనంత శ్రీరామ్ చెప్పారు.

గాయని స్మిత మాట్లాడుతూ..
రాసిన పాట విన్నాక, లిరిక్స్ చూశాక.. ఇంత అధ్భుతమైన పాటను చేయకుండా ఉండలేక.. జనాల్లోకి తీసుకుని వెళ్లాలని మంచి కార్యక్రమం అందరికీ తెలియాలని సద్గురు గురించి మా ద్వారా ఎంత చేయగలిగితే అంత జనాల్లోకి తీసుకునివెళ్లాలని నిర్ణయం తీసుకుని పాటను పాడినట్లు చెప్పారు. గోపీ మ్యూజిక్ అందించారని, చాలా తక్కువ టైమ్ లో అధ్భుతంగా మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారని అన్నారు. అయితే మాములుగా పాటను విడుదల చేయాలని అనుకుని కూడా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా సపోర్ట్చేస్తున్నారనేది అందరికీ తెలియాలని ఈ స్టేజ్ మీద పాటను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు హైదరాబాద్ ఇషా వాళ్లు బాగా సపోర్ట్ చేశారని అన్నారు.అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి తనవంతుగా 5వేల చెట్లు ఇద్దామని అనుకున్నానని, మా అమ్మ గారు కూడా ఇవ్వాళ ఇక్కడ రాలేకపోతున్నట్లు చెప్పి ఏమి చేద్దాం అంటే 5వేల చెట్లు ఇద్దామని అనుకుంటే ఆమె కూడా 500 చెట్లు ఇద్దామని అన్నారని, అలాగే నేను ఈ మాటచెప్పగానే దేవాగారు వెయ్యి చెట్లు ఇస్తున్నట్లు శ్రీమతి స్మిత గారు చెప్పారు. అలాగే భారతీయం తరుపున గొట్టిపాటి సత్యవాణి 500చెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు.

ఆధ్యాత్మికురాలు గొట్టిపాటి సత్యవాణి మాట్లాడుతూ...

కావేరి పిలుస్తుంది రా అని పాట మొదలైంది. మన దిన చర్యలోనే కావేరిని తలుచుకోవడం జరిగిందని, మన భారతదేశం నదీనదాలకి పెట్టింది పేరు. జీవనదుల కారణంగా మనదేశం సస్యశ్యామలంగా, నాగరికత పరిఢవిల్లిన ప్రాంతంగా, ఆధ్మాత్మిక యశస్సులు వెదజల్లే స్వర్గధామంగా, ప్రపంచదేశాలలో తలమానికంగా నిలిచిందని అందులో భాగంగానే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు అంటూ ఆ బక్కెట్లో ఉన్న నీటినే సప్త నదులను ఆవాహనం చేశారు. పుణ్య నదుల నుంచి వచ్చిన నీళ్లుగా భావించి మనం స్నానం చేస్తామని అటువంటి నదులను కాపాడుకోవడం మన బాధ్యత అని ఆమె అన్నారు.ఆధునిక కాలంలో ప్రకృతిని విస్మరించి ప్రకృతిని జయించానంటూ విర్రవీగుతున్నారని నీటిని వృధా చేస్తూ.. నీటిని గౌరవించకుండా.. ఉంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆమె చెప్పారు. అలాగే ఆధ్యాత్మికత అంటే పద్యాలు చదువుకోవడం, శ్లోకాలు పాడుకోవడం కాదని, మన జీవన విధానం ఏదైతే పూర్వికులు మనకు ఇచ్చారో.. దానిని నిత్య జీవనంలో కలుపుకుని వెళ్లడం అని అన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే అని ఆమె అన్నారు. ఇటీవలికాలంలో వర్షాలు పడకపోవడానికి కారణం మానవ తప్పిదాలే అని, వరదలు, తుఫానులు చూస్తున్నామే తప్ప మంచి వాన రావడం చూడలేకపోతున్నామని మా తరం కంటే ఇప్పటితరం మేల్కొంటే మంచి జరుగుతుంది అని ఆమె అన్నారు. అలాగే స్మిత గాయని మాత్రమే కాదు. స్మితకు దేశభక్తి ఎక్కువ అని, సామాజిక బాధ్యతతో ప్రతీ పని చేస్తుందని అందులో భాగంగా ఇటువంటి పాటను రూపొందించడం మంచి విషయం అని అన్నారు. అనంత శ్రీరామ్ గారంటే నాకు చాలా ఇష్టం అని, ఆయనను కూడా అభినందించాలని అన్నారు. ప్రసార మాధ్యమాలు కూడా ఇటువంటి విషయాలను చూపించాలని కోరారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved