25 November 2021
Hyderabad
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను ఊహించని వరదలు ముంచెత్తాయి. గత కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తు ఈ మధ్యకాలంలో ఏపీ చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. ఈ వరదల కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణమే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి మెగా ఫ్యామిలీ ముందుంటుంది. తిరుపతి వరదలకు స్పందించిన నిర్మాత అల్లు అరవింద్ గారు తన వంతు సహాయం అందించారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వాళ్లకు తనవంతు సహాయంగా.. గీతా ఆర్ట్స్ తరఫున 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరదలు బాధాకరమని ఆయన తెలిపారు. వీటి వల్ల నష్టపోయిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు.