నారా రోహిత్, నాగశౌర్య, నమిత ప్రసాద్, నందితరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'కథలో రాజకుమారి'. మహేష్ సూరపనేని దర్శకుడు. సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్రెడ్డి, కృష్ణ నిర్మాతలు. సినిమా సెప్టెంబర్ 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేష్ సూరపనేని పాత్రికేయులతో మాట్లాడారు.
నేపథ్యం...
- మాది విజయవాడ. ఇంజనీరింగ్ వరకు విజయవాడలోనే చదివాను. యు.ఎస్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను. తేజగారి వద్ద నీకు నాకు డాష్ డాష్ సినిమాకు పనిచేశాను. తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు, కోనవెంకట్గారి దగ్గర పనిచేశాను. గత రెండేళ్లుగా వైజయంతీ మూవీస్ బ్యానర్తో కలిసి ప్రయాణిస్తున్నాను. వారికి సంబంధించిన పలు యాడ్స్ను డైరెక్ట్ చేశాను.
విలన్ క్యారెక్టర్...
- రోహిత్ ఇందులో పూర్తిస్థాయి విలన్గా నటించాడు. సినిమా ముప్పావు భాగం వరకు విలన్గానే కనిపించే నారా రోహిత్ తర్వాత పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తిగా ఎలా మారాడనేదే కథ. నారా రోహిత్గారు కథకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆయన క్యారెక్టర్ వినగానే ఆయనకు చాలా కొత్తగా అనిపించి వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
టెన్షన్ లేదు..
- ఈ సెప్టెంబర్ 15న సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్నప్పటికీ నాకు సినిమా రిజల్ట్పై నమ్మకంపై టెన్షన్ లేదు. చాలా కూల్గా ఉన్నాను.
నాగశౌర్య క్యారెక్టర్ గురించి...
- సినిమాలో సినిమా బ్యాక్డ్రాప్ ఓ పదిహేను నిమిషాల పాటు ఉంటుంది. అందులో నాగశౌర్య కనపడతాడు. సినిమా మొత్తంలో నాగశౌర్య 25 నిమిషాల పాటు కనపడతాడు. అలాగే సినిమాలో నందితరాజ్ కూడా కీలక పాత్రలో నటించింది. మరో కీలకమైన పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించారు.
మ్యూజిక్కు రెస్పాన్స్...
- పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో బిట్ సాంగ్తో కలిసి మొత్తం ఏడు సాంగ్స్ ఉన్నాయి. అందులో ఓ రెండు సాంగ్స్ కాస్తా డిఫరెంట్గా చేయించాలనిపించి ఇళయరాజాగారితో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్, టీజింగ్సాంగ్ను కంపోజ్ చేయించాను. మిగిలిన మ్యూజిక్ అంతా విశాల్ చంద్రశేఖర్గారే కంపోజ్ చేశారు.
తదుపరి చిత్రాలు...
- ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రెండు సబ్జెక్ట్ ఉన్నాయి. వాటికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి.