ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు నాగశౌర్య. నటనలో నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే ఈ హీరో వరుసగా మంచి ఫ్యామిలీ సబ్జెక్టులను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈయన నటించిన తాజా సినిమా ఒక మనసు. మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు చిత్రం దర్శకుడు రామరాజు దర్శకత్వంలో నటించారు. ఈ సినిమాను టీవీ9 సమర్పిస్తోంది. మధుర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి గురువారం హైదరాబాద్లో నాగశౌర్య విలేకరులతో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ ``ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఒక్క కట్ కూడా లేకుండా పాజిటివ్గా ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఈ నెల 24న విడుదలవుతుంది. ఇందులో నేను సూర్య అనే పాత్రలో చేశాను. ఒకమ్మాయి మహిళగా మారే వైనాన్ని, అబ్బాయి మగవాడిగా మారే క్రమాన్ని దర్శకుడు చాలా అందంగా తెరకెక్కించారు. నీహారికతో నటించడం బావుంది. తను పేరున్న ఇంటి అమ్మాయి కదా? కలుస్తుందో? లేదో అని అనుకున్నా. చాలా బాగా కలిసిపోయింది. మా దర్శకుడు చాలా అందంగా తెరకెక్కించారు. నాతో నటించిన నాయికల్లో మాళవిక, ఇప్పుడు నీహారికతో నటించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. జీవితంలో ప్రతి చోటా ప్రేమ ఉంటుంది. అది హ్యాపీగా కూడా ఉంటుంది. ఇంతకు ముందు నేను రాశీఖన్నాతో డేటింగ్ చేస్తున్నానని అన్నారు. ఆ తర్వాత సోనారిక అన్నారు. మధ్యలో రెజీనా పేరు వినిపించింది. ఇప్పుడు నీహారిక పేరు వినిపిస్తోంది. ఇలాంటి విషయాలను మా వాళ్లు పట్టించుకోవడం మానేశారు. నేను ఈ చిత్రం తర్వాత జో అచ్యుతానంద చిత్రంలో చేస్తున్నాను. 65 శాతం షూటింగ్ పూర్తయింది. మరోవైపు హుస్సేన్షా దర్శకత్వంలో సుకుమార్ సినిమా ఉంది`` అని తెలిపారు.