అక్షయ్ ప్రత్యూష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జి.మురళిప్రసాద్ దర్శకత్వంలో రామచంద్ర, అశాలత హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అమ్మాయి ఆరుగురు’. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా..
చిత్ర హీరో, నిర్మాత రామచంద్ర దోసపాటి మాట్లాడుతూ ‘’ఈ చిత్రం బావా మరదళ్లకు సంబంధించిన కథ. వారిద్దరూ చదివే కాలేజ్ లో ఆరుగురు ధనవంతుల బిడ్డలు చదువుతుంటారు. వారికి ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటారు. అలా ఓరోజు హీరో హీరోయిన్స్ చంపేస్తారు. హీరోయిన్ దెయ్యంగా మారి వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకుందనేదే అసలు కథ. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇది వరకు చాలా కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఎమోషన్స్ క్యారీ అయిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే నాకు నటుడిగా చేయాలని చాలా కాలంగా కోరిక. అందుకనే ఈ సినిమాలో నటించాను. ఫ్యూచర్ లో కూడా నాకు నచ్చిన పాత్రల్లో తప్పకుండా నటిస్తాను. దర్శకుడు మురళీ ప్రసాద్ కథ నెరేషన్ చేసిన విధానం నాకు నచ్చింది. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మురళిగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఆయన ప్లానింగ్ వల్ల సినిమాను అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయగలిగాం. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వందేమాతరం శ్రీనివాస్ గారు మంచి సంగీతాన్నందించారు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఇంకా ప్లస్ అవుతుంది. అలాగే సుధీర్ గారు సినిమాటోగ్రఫీ బావుంది.
ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా విడుదలైన రెండు నెలలు తర్వాత నా బ్యానర్ లో నెక్ట్స్ మూవీ ఉంటుంది’’ అన్నారు.