18 December 2017
Hyderabad
నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా నటించిన చిత్రం ‘ఇ ఈ’. రామ్ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదల డిసెంబర్ 22న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతిరావు మీడియాతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ``మాది అత్తిలి. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత యానిమేషన్ కోర్సు చేయడానికి హైదరాబాద్ వచ్చాను. 1997లో అక్కినేని హార్ట్ యానిమేషన్ అకాడమీ అనే సంస్థ బంజారా హిల్స్లో ఉండేది. అక్కడే కోర్సులో జాయిన్ అయ్యాను. అక్కడే దర్శకుడు మారుతిగారు కూడా కోర్సులో చేరారు. ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. రెండేళ్లు కోర్సు చేసిన తర్వాత ఇద్దరం 8-9 ఏళ్లు కలిసి పనిచేశాం. తర్వాత నేను యానిమేషన్ డైరెక్టర్గా ఫ్రాన్స్ వెళ్లాను. 2009-16 వరకు నేను ఫ్రాన్స్లో ఉన్నాను. 300-400 ఎపిసోడ్స్ యానిమేషన్ ఎపిసోడ్ సూపర్వైజ్ చేశాను. ఇప్పుడు పపుల్స్ అనే యానిమేషన్స్ సీరియల్ను నేనే డైరెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ సీరియల్ 80 కంట్రీస్లో వస్తుంది. తెలుగులో ఎప్పటి నుండో సినిమా తీయాలనుకుంటున్నాను. ఆ ఆసక్తితో 2012 నుండి కథలు రాయడం మొదలు పెట్టాను. మాస్ నుండి క్లాస్ వరకు అందరికీ నచ్చే ఓ కథను తయారు చేసుకున్నాను. ఆ కథే `ఇఈ`. ఇందులో సన్నివేశాలు హాస్యంతో నిండి ఉంటాయి. కొత్త నటీనటులతో పాటు సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనపడతారు. హీరో కన్నడంలో సినిమాలు చేశాడు. ఈ సినిమా కోసం అతన్ని ఎంపిక చేసుకున్న తర్వాత హీరోయిన్ను ఎంపిక చేసుకున్నాను. కథ విషయానికి వస్తే, ఇలాంటి పాయింట్ను ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ చేయలేదని చెప్పగలను. ఇంటర్వెల్ తర్వాత హీరో ఆత్మ హీరోయిన్లోకి, హీరోయిన్ ఆత్మ హీరోలోకి ప్రవేశిస్తుంది. అసలు ఆత్మలు ఎందుకు మారాయి?. చివరకు ఎమయ్యింది? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. హీరోకి లవ్ బ్రేకప్స్ వల్ల అమ్మాయిలంటే ఆసహ్యం ఏర్పడుతుంది. కథ ఇలా సాగుతుండగా ఓ గురువుని కలుసుకున్న హీరో, ఆయన ముందుకు అమ్మాయిల గురించి అవహేళనగా మారుతాడు. అప్పుడు గురువు హీరోను ఏమని శపిస్తాడు? అలాగే హీరోయిన్కి కూడా మగవాళ్లంటే పడదు. ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ప్రయాణం ఏమయ్యిందనేదే కథ. సినిమాలో కామెడీయే ప్రధాన హైలైట్. సినిమా చూసిన సెన్సార్ వాళ్లు ఇందులో మహిళలు గురించి మంచి మెసేజ్ ఇచ్చావని అప్రిసియేట్ ఇచ్చారు. రెహమాన్గారి పర్సనల్ మ్యూజిక్ చీఫ్ కృష్ణ చేతన్ సంగీతం అందించారు. అలాగే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించారు. నాని, అఖిల్ సినిమాలు విడుదలవుతున్నాయి. వారితో పాటు నా సినిమా కూడా విడుదలవుతుండటం ఆనందంగానే ఉంది. వారి సినిమాలతో పాటు నా సినిమాను కూడా ప్రేక్షకలు ఆదరిస్తారని భావిస్తున్నాను. అమ్మ ప్రేమను ఈ సినిమా అద్భుతంగా చూపించాను. 150-200 థియేటర్స్లో సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను నా సోదరుడు లక్ష్మణ్ రావు నిర్మించారు. ట్రై కలర్ అధినేత చందన్ కుమార్గారు సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చి, అద్భుతంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులో మంచి మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. అల్లు అర్జున్ నాకు మంచి స్నేహితుడు. తనతో ఎప్పటికైనా సినిమా చేస్తాను. అలాగే ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి`` అన్నారు.