3 January 2017
Hyderabad
నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. సంక్రాంతికి సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రాతో ఇంటర్వ్యూ...
ఎక్కువగా స్టడీ చేసింది ఆయనే...
- శాతకర్ణి, శాతావాహనులు గురించి ఆసక్తి ఉండేది. ఎప్పుడైతే క్రిష్గారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేద్దామని అన్నారో నేను కూడా శాతకర్ణి గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాను. కృష్ణం వందే జగద్గురమ్ సినిమా తర్వాతే క్రిష్గారికి శాతకర్ణి సినిమా గురించిన ఆలోచన వచ్చింది. అప్పటి నుండి స్టడీ చేయడం మొదలు పెట్టారు. మధ్యలో కంచె సినిమా తీశారు. కంచె సినిమా, గబ్బర్ సినిమాలను చేస్తూనే ఈ సినిమా గురించి వివరాలు సేకరించారు. వివిధ పుస్తకాలు సేకరించాం. దాని నుండి వివరాలు రాబట్టారు. శాతకర్ణి గురించి ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్గారు మాత్రమే. క్రిష్గారు నాసిక్ శాసనాలు, యూనివర్సిటీ పుస్తకాలు, యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖలు చదివినప్పుడు అప్పటి సంస్కృతిని తెలుసుకున్నాం. కథలో ఎక్కడా ఫిక్షన్ లేదు. చరిత్రలో ఏం జరిగిందో దాన్నే సినిమాగా తీశాం. సినిమా ప్రకారం సన్నివేశాలను డ్రెమటైజేషన్ చేశాం. కథ అంతా రెడీ అయిన తర్వాత ఈ సినిమా బాలకృష్ణగారు చేస్తేనే బావుంటుందండీ అని నేను క్రిష్గారితో అంటే నేను అల్రెడి మాట్లాడేశాను సాయి అన్నారు. నెరేషన్ వినగానే బాలకృష్ణగారు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసేశారు.
అందరికీ వచ్చే అవకాశం కాదు...
- మొదటి సినిమా కృష్ణం వందే జగద్గురమ్ సినిమా చేసినప్పుడు ఎలా ఫీలై వర్క్ చేశానో ఈ సినిమాకు కూడా అలాగే వర్క్ చేశాను. హిస్టారికల్ మూవీస్ అల్రెడి చూసిన అనుభవం ఉంది. తెనాలి రామకృష్ణుడు, చాణక్య చంద్రగుప్తుడు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు పనిచేయాలనే దుగ్ధ అందరికీ ఉంటుంది. కానీ అవకాశం రాదు. నాకు అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం పట్టలేదు. కానీ లోకేషన్స్ అనుసరించి చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి. సన్నివేశాలను కథ ప్రకారం ఎన్హాన్స్ చేసుంటూ వెళ్లడమే. డైలాగ్స్కు ఇంత మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంటుంది.
ముందు భయపడ్డాను...
- 99 సినిమాలు చేసిన బాలకృష్ణగారు నా ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఎందరో మహానుభావులు రాసిన డైలాగ్స్ చెప్పిన వ్యక్తి. మన డైలాగ్స్ నచ్చుతాయో లేదో, ఏమంటారోనని ఫస్ట్ రోజు భయపడ్డాను. కానీ ఆయన డైలాగ్స్ చదవగానే చాలా బావున్నాయని బాలకృష్ణగారు అన్నారు.
గొప్పగా అనిపిస్తుంది....
- గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు ఖైదీ నంబర్ 150 సినిమాకు కూడా కొన్ని డైలాగ్స్ నేను రాశాను. ఇప్పుడు రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రెస్టీజియస్ మూవీస్ కావడం ఇంకా గొప్పగా ఉంది.
Sai Madhav Burra interview gallery |
|
|
|
అది ఎవరికీ తెలియదు....
- అప్పటి తెలుగు ఎవరికీ తెలియదు. పాతికేళ్ల క్రితం ఉన్న తెలుగులో మాట్లాడితేనే ఎవరికీ అర్థం కాదు. అలాంటి మొదటి శతాబ్దంలో భాషను ఎలా వాడుతాం. కాబట్టి అందమైన తెలుగును, అందరికీ అర్థమయ్యే తెలుగులోనే సంభాషణలు రాశాను. మన తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువగా మిళితమైపోవడం కూడా మనకు చాలా ప్లస్ అని చెప్పవచ్చు.
అన్ని సినిమాలు ఆడాలి...
- వార్ వన్ సైడ్ అయ్యింది...వంటి మాటలను నేను పట్టించుకోను. సినిమాను ఒక వ్యక్తిగా చూడకూడదు. ఎందుకంటే సినిమా ఒక వ్యక్తి కాదు. వ్యవస్థ. కొన్ని వందల మంది కష్టం ఉంటుంది. కాబట్టి నేను పనిచేసినా, చేయకపోయినా అన్ని సినిమాలు బాగా ఆడాలి. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బావుంటుంది.
మేం చెప్పిన కథ అదే...
- అప్పట్లో భారతదేశం చిన్న చిన్న గణ రాజ్యాలుగా ఉండేవి. ఇలాంటి గణ రాజ్యాలను కలిపి ఒక దేశంగా ఎలా చేశాడనేదే గౌతమిపుత్ర శాతకర్ణి. సినిమా అంతా ఒక జర్నీలా ఉంటుంది. దేశమంతటినీ జయిస్తూ రావడం వల్ల త్రి సముద్ర తోయ పాన వాహన అనే బిరుదు కూడా ఉండేది. అంటే ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీటిని తాగినవని అర్థం. అటువంటి గుర్రాలను అధిరోహించి యుద్ధం చేసిన వాడని అర్థం. చరిత్ర ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణికి ఒకటమనేదే లేదు. ఆయన మరణం కూడా సహజ మరణమే. అయితే సినిమాలో ఆయన దేశాన్ని ఎలా ఏకం చేశాడనే విజయగాథను చూపించాం.
తదుపరి చిత్రాలు...
- మంజులగారి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా చేయనున్న సినిమాతో పాటు కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో సావిత్రిగారి బయోపిక్ మహానటి సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాను.