20 November 2017
Hyderabad
జయతి గడ్డం నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'లచ్చి'. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో చంద్రమోహన్, రఘుబాబు, ధనరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా జయతి సినిమా గురించి మాట్లాడుతూ ...``జెమిని టీవీలో వెన్నెల అనే ప్రోగ్రామ్ ద్వారా నేను అందరికీ సుపరిచితురాలినే. ఆ ప్రోగ్రామ్ నుండి గ్యాప్ తీసుకుని లచ్చి అనే సినిమాను నేను నిర్మిస్తూ అందులో నటించాను. గతంలో ఎంత మంది మహిళా నిర్మాతలు వచ్చారో నాకు తెలియదు. కానీ నేను చాలా ఇష్టపడి ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అవుట్ డోర్ లోకేషన్లో 60-70 రోజుల పాటు సినిమాను చిత్రీకరించాం. మంచి అవుట్ రావాలని బాగానే టెన్షన్ పడ్డాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత హ్యాపీగా ఫీలయ్యాను. ఈ నవంబర్ 24న సినిమా విడుదల చేస్తున్నాం. నేను వెన్నెల ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రేక్షకులు నన్నెలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను జెమినీలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ గేమ్ షోస్ అన్ని ప్రొడ్యూస్ చేశాను. డైరెక్టర్ ఈశ్వర్గారు పవన్కల్యాణ్గారి దగ్గరుండే డైరెక్షన్ టీంలో వర్క్ చేశారు. తను నెరేట్ చేసిన విధానం నచ్చడంతో సినిమాను నిర్మించాలనుకున్నాను. అలాగే ముందుగా నటించాలని కూడా అనుకోలేదు. అయితే అందులో పాత్ర చాలా డీసెంట్గా, నాకు సరిపోతుందనిపించేలా ఉండటంతో నటించడానికి కూడా సిద్ధమయ్యాను. టీవీ నుండి బిగ్ స్క్రీన్కి చేయబోయే ప్రయత్నం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. ఈ లచ్చి సినిమా కంటే ముందుగానే నేను మలయాళ చిత్రం `మై బాస్` సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఆ సినిమాను తొలి సినిమాగా చేద్దామనుకున్నాను. అయితే దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందనిపించడంతో లచ్చి సినిమాను స్టార్ట్ చేశాను. చిన్న బడ్జెట్లోనే చేద్దామని అనుకున్నాను కానీ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో బడ్జెట్కు కాస్త పెంచి సినిమాను బాగానే నిర్మించాను. సినిమా పూర్తి కామెడీ చిత్రం. విలేజ్ బ్యాక్డ్రాప్ల సాగే చిత్రం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. ఈ సినిమాలో నేను దేవి అనే ఆత్మలను పట్టే క్యారెక్టర్లో కనపడతాను. ఈ దేవి అనే అమ్మాయి..ఓ ఊరి సమస్యను ఎలా పరిష్కరించిందనేదే కథ. నాతో పాటు రఘుబాబు, ధన్రాజ్, చంద్రమోహన్ సహా కామెడీ గ్యాంగ్ అంతా సినిమాలో కనపడుతుంది. లచ్చి అనే క్యారెక్టర్ను మరో అమ్మాయి చేస్తుంది. ఆ లచ్చి ఏమైందో తెలుసుకునే దిశగా నా క్యారెక్టర్ సాగుతుంది. సబ్జెక్ట్ సీరియస్ కానీ కామెడీ స్టైల్లో సాగుతుంది. హారర్ థ్రిల్లర్ విత్ సస్పెన్స్ ప్రధానాంశాలుగా ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఎం.వి.రఘుగారి సినిమాటోగ్రఫీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రకరించారు. అలాగే, సురేష్ యువన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. టీవీల్లో యాంకర్గా చేయడం వేరు. సినిమాల్లో నటించడం వేరు. నటిస్తూ, నిర్మించడం కాస్త కష్టమైన విషయమే. రెండింటి కారణంగా కాస్త టెన్షన్ పడ్డాను. ఈ సినిమాతో జయతి బాగా చేసిందనే గుర్తింపు వస్తే చాలు. ప్యాషన్తో చేసిన సినిమానే ఇది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమజ్ కాలేదు. మరి ప్రేక్షకులు నటిగా ఆదరిస్తారో..నిర్మాతగా ఆదరిస్తారో చూడాలి. ప్రస్తుతం దర్శకత్వం చేయాలనే ఆలోచనే లేదు. ఎందుకంటే దర్శకత్వం చేయడం చాలా కష్టం. ఈ సినిమా సక్సెస్ అయితే..మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తాను. నేను గ్లామర్ పాత్రల్లో నటించలేను. నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను`` అన్నారు. .