22 March 2018
Hyderabad
నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్పై ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన చిత్రం 'ఎంఎల్ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది.
ఈసందర్భంగా కాజల్ అగర్వాల్ సినిమా గురించి పాత్రికేయులతో మాట్లాడుతూ ``కల్యాణ్రామ్తో పదేళ్ల క్రితం నటించాను. ఇప్పుడు మళ్లీ నటించడం బావుంది. ఈ ప్రయాణంలో ఇద్దరం ఎంతో మార్పు చెందాం. ఇద్దరి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నాం. నా పాత స్నేహితుడిని కలిసినట్లు అనిపించింది. ఎవరి వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలతో బిజీగా ఉంటున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఓ పబ్లిక్ ఫంక్షన్లో కలిశానంతే. మధ్యలో ఎప్పుడూ కలవలేదు. 'లక్ష్మీకల్యాణం' చేసేటప్పుడు ఒక సినిమా చేస్తే చాలు. మానేసి వెనక్కి వెళ్లిపోయి ఎం.బి.ఎ చదువుకుందామనిపించింది. కానీ జీవితం వేరేలా ఉంటుంది కదా! ఈ ప్రయాణం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడికి, తెలుగు ప్రేక్షకులకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి..వారి కుటుంబంలో నన్ను ఒకరిగా భావించినందుకు థాంక్స్. నాకు తెలుగు ఇండస్ట్రీలోనే లైఫ్ అని ఐదు సినిమాలు చేసిన తర్వాత అనిపించింది. నా మగధీర చేసేటప్పుడు వందశాతం ఇదే నా లైఫ్ అని అర్థమైంది. 'ఎం.ఎల్.ఎ' సినిమా విషయానికి వస్తే.. ఇందులో నేను ఎన్నారై అమ్మాయి పాత్రలో కనపడతాను. నా క్యారెక్టర్లో ఓ షేడ్ ఉంటుంది. నేను ఎందుకు అలా చేస్తుంటానో అనే షేడ్ ఇంటర్వెల్ వరకు కనపడదు. దానికి కారణాలేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. మంచి మెసేజ్ కూడా ఉంది. అయితే ఈ మెసేజ్ హార్డ్ వేలో కాకుండా ఎంటర్టైనింగ్ తరహాలో ఉంటుంది. నేను చేస్తున్న సినిమాలు, పాత్రలు పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. వీలైనంత కొత్తదనం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను సిన్సియర్గా నా పాత్రలకు న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నాను. నందమూరి కల్యాణ్రామ్ తను చేసే పని పట్ల చాలా నిజాయితీగా, ప్యాషన్తో ఉంటాడు. చాలా ప్రొఫెషన్, ఫోకస్డ్గా ఉంటాడు. ప్రేక్షకులు ఆసక్తికరమైన సినిమాలు చూడాలనుకుంటుంటారు. అలాంటి సమయంలో.. ఓ నటిగా విభిన్నమైన సినిమాలు చేయాలని అనుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే మంచి పాత్రలు చేస్తూ వస్తున్నాను. కమర్షియల్ సినిమాలు, కొత్త తరహా సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాను'' అన్నారు.