దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. జూన్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్ టైనర్ ను కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోవింద్ లాలం మాట్లాడుతూ.. "మా సినిమా సెన్సార్ పూర్తయ్యింది. హారర్ కి హిలేరియస్ కామెడీ కలగలిసి "మాయా మాల్" ఎగ్జయిటింగ్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులందరూ బాగుందంటూ మెచ్చుకోవడంతోపాటు.. నా దర్శకత్వ ప్రతిభను కొనియాడడం ఎప్పటికీ మరువలేను. "మాయామాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్టైనర్ అని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం. జూన్ 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.