కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కొత్తదనంతో కూడిన కథతో చేస్తున్న విభిన్న చిత్రమిది. నరేష్ కెరీర్లో మరో మైలురాయిలా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం వుంది. గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్ప్లే హైలైట్గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్ వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. సెన్సారు సభ్యుల అభినందనలతో క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. సెప్టెంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.