pizza
Permission soon for film shoots
You are at idlebrain.com > news today >
Follow Us

28Hyderabad

సినిమా, టీవీ షూటింగ్ లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం MCHRD లో సినిమా, టీవీ షూటింగ్ ల కు అనుమతులు, థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాల పై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్ ల ప్రతినిధులతో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, దియేటర్ లలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతిని అందజేశారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం రాత్రి సమయాలలో ఆర్టిస్టులు, సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా, పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్ లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. సినీ రంగ ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై లోతుగా చర్చించారు. దియేటర్ లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. షూటింగ్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, ఏర్పాట్లపై కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తామని సమావేశంలో పాల్గొన్న సినీ, టీవీ రంగ ప్రతినిధులు స్పష్టం చేశారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినీ రంగానికి చెందిన ఏ విషయమైనా ప్రభుత్వం ఎప్పుడూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన సూచనలు, వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో షూటింగ్ లకు అనుమతులు, దియేటర్ ఓపెనింగ్ అంశాలే కాకుండా సినిమా దియేటర్ లకు ప్రత్యేక విద్యుత్ టారీఫ్, ఫ్లెక్సి టికెటింగ్ ధరలు, అన్ లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్ లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అంశాలను సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీ లో పొందుపరచడం జరుగుతుందని మంత్రి వివరించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరగుతుందని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో నటులు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, N.శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు c.కళ్యాణ్, KS.రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ళ ప్రతినిధులు బాపినీడు, జెమిని కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళి మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రాం మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

 


 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved