2 December 2017
Hyderabad
సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం `జవాన్`. దిల్రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో కృష్ణ సినిమాను నిర్మించారు. సినిమా డిసెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్బంగా సినిమాలో కేశవ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన నటుడు ప్రసన్న మీడియాతో సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు.
ప్రసన్న మాట్లాడుతూ - ``జవాన్` రెస్పాన్స్ చాలా బావుంది. ఇంత పెద్ద రెస్పాన్స్ను ఊహించలేదు. ముఖ్యంగా ఆడియెన్స్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రవిగారికి, సాయిధరమ్ తేజ్గారికి, దిల్రాజుగారికి థాంక్స్. స్ట్రాంగ్ విలన్ రోల్నే ఇవ్వకుండా సినిమా ఆసాంతం ప్రాముఖ్యత ఉండే పాత్ర చేసేందుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. దిల్రాజుగారు నిర్మాతగా పనిచేసిన ఈ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. ఈ క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్లు నా పేరును ఆయనకు సూచించారట. అంతకు ముందు నేను గోపీమోహన్, కోనవెంకట్గారిని కలవనే లేదు. ఈ మధ్యనే కలిశాను. కలిసినప్పుడు వారికి థాంక్స్ చెప్పాను. వారి కారణంగా జవాన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
చెన్నైలో రవిగారు నన్ను కలిశారు. తమన్గారు ఫోన్ చేసి ఇలా సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా ఉంది. డైరెక్టర్ని కలవమని చెప్పారు. నేను కలిశాను. ఆయన అరగంట కథ చెప్పగానే నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో ఈ క్యారెక్టర్ బాగా వర్కవుట్ అవుతుందని ముందుగానే ఊహించాను. ఇంత మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. మరో పక్క నా కల నిజమైనట్లు ఉంది. మంచి టీంతో కలిసి పనిచేశాను. యూనిట్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. నా ఫిలిం కెరీర్లో జవాన్ సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సినిమాలో నా క్యారెక్టర్ను `ధృవ` చిత్రంలో అరవింద్ స్వామిగారు పోషించిన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్తో పోల్చడం చాలా గొప్ప విషయంగా ఫీలవుతున్నాను. నా భార్య స్నేహ కానీ, ఇతర కుటుంబ సభ్యులెవరూ ఈ సినిమానెవరూ చూడలేదు. సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేసినా, నా పెర్ఫార్మెన్స్కు ఎంతో స్కోప్ ఉన్న పాత్ర. ఓ మంచి సదావకాశంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు మంచి నటుడు ఎవరైనా, భాషతో సంబంధం లేకుండా అభిమానిస్తారు. అలాగే నన్ను కూడా ఆదరిస్తున్నారు. నెగటివ్ రోల్ అయినా చాలా బాగా నచ్చడంతో చేశాను. నేను, బాబీ సింహ, అమలాపాల్ నటించిన `తిరుట్టుపయలే -2` చిత్రం నాకు 25వ సినిమా. ఈ చిత్రం కూడా ఈ గురువారమే తమిళంలో విడుదలవగా, తెలుగులో `జవాన్` విడుదలైంది. రెండు సినిమాల్లో నేను విలన్గానే నటించాను. నా పాత్రలకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. నేను తెలుగులో నటించాలని కోరుకునే వ్యక్తుల్లో స్నేహ ఒకరు. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం, గౌరవం. అదే నమ్మకంతో నాగార్జునగారు హీరోగా, నిర్మాతగా చేసిన `భాయ్` చిత్రంలో నాకు అవకాశం రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా నటించమని చెప్పింది. తన మాటతో అసలు సినిమా కథేంటో కూడా తెలుసుకోకుండా నటించాను. అలాగే `జవాన్`లో నటించడానికి అంగీకరించినప్పుడు కూడా తనెంతో హ్యాపీగా ఫీలైంది. డిటెక్టివ్ సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాను. ఆ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ను రాబట్టుకుందని తెలిసింది. మిస్కిన్ వంటి డైరెక్టర్తో పనిచేయడం మరచిపోలేని అనుభూతి. ఇప్పుడు ఆయనతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. డిటెక్టివ్ 2 ఇంకా ప్లాన్ చేయలేదు. విశాల్తో పాటు నాకు కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తి కాగానే సీక్వెల్ ఉండొచ్చు. రెండు మూడు సీక్వెల్స్ చేద్దామని ప్లాన్ అయితే ఉంది కానీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు చెప్పలేను. ఇక జవాన్ విషయానికి వస్తే, సాయిధరమ్ తేజ్ చాలా సింపుల్, ఫ్రెండ్లీ కోస్టార్. నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. మనసులో కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాను. కానీ సాయిధరమ్ను కలవగానే ఆ ఇబ్బంది పోయినట్లపించింది. కారణం..అతను నాతో తమిళంలో మాట్లాడారు. అలాగే, ఎంతో కంఫర్ట్ ఇచ్చారు. డైలాగ్స్ విషయంలో ఎంతో సపోర్ట్ చేశారు. ఓ అన్నయ్య నన్ను ట్రీట్ చేశాడు. తనతో ఎప్పుడైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే. తమిళంలో ఓ పోలీస్ సినిమాలో నటించబోతున్నాను. అది జనవరిలో స్టార్ట్ అవుతుంది`` అన్నారు.