pizza
Rajasekhar condolences to Venu Madhav
వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు – డాక్టర్ రాజశేఖర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 September 2019
Hyderabad

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ అన్నారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంకా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘వేణుమాధవ్‌తో మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని వేణుమాధవ్‌ పిలిచేవారు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్‌ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్‌ చేసి విష్‌ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికల సమయంలో వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా... ‘మా’కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవారు. తన అభిప్రాయం చెప్తారు. గత వారం ఆయన హాస్పటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్‌ అయ్యారు. మళ్లీ సీరియస్‌ అయిందని మంగళవారం అడ్మిట్‌ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు. వేణుమాధవ్‌ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు’’ అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved