26 January 2022
Hyderabad
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. అనే మాటకు ఉదాహరణగా మనం చాలా మందినే చూస్తుంటాం. వారిని చూసినప్పుడు ఎంతో ఇన్స్పైర్ అవుతుంటాం. అలాంటి వారు సినీ పరిశ్రమలో అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి అరుదైన వారిలో మాస్ మహరాజా రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. పడిపోయాడే అని అనుకున్న ప్రతీసారి.. రేట్టింపు వేగం పైకి లేచి అందరూ ఆశ్చర్యపోయేలా విజయాలను సాధించడం రవితేజ స్పెషాలిటీ.
కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న రవితేజ హీరో ఫ్రెండ్గా, విలన్ గ్యాంగ్లో మెంబర్గా ఇలా కనిపిస్తూ యాక్టర్గా తనదైన గుర్తింపు దక్కించుకున్నారు. అలా అలా మరింత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి నటుడి నెక్ట్స్ రేంజ్కు చేరుకున్నారు. ‘నీ కోసం’ సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా బావుందని అందరూ మెచ్చుకున్నారు. సినిమాకు నంది అవార్డ్ కూడా వచ్చింది. డైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో రవితేజలకు నీకోసం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంతో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు. తర్వాత వారిద్దరి కాంబినేషన్లో చేసిన ఇడియట్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశారు రవితేజ. పూరి తన హీరో ఎలా ఉండాలని అనుకుంటున్నారో అంత కంటే గొప్పగా స్క్రీన్పై పండేలా తనదైన ఎనర్జీతో మాస్ రాజా రవితేజ క్యారెక్టర్ను రఫ్ ఆడించేశారు. తర్వాత మరోసారి అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారారు.
భద్ర, కిక్, పవర్ , డాన్ శీను వంటి చిత్రాలతో సెన్సేషనల్ విజయాలను సాధించడమే కాదు.. బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి, కె.ఎస్.రవీంద్ర వంటి మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్స్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన క్రెడిట్ రవితేజకే దక్కుతుంది. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు.. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, శంభో శివ శంభో వంటి డిఫరెంట్ సినిమాలు చేసి నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. గత ఏడాది కరోనా సమయంలో థియేటర్స్కు ప్రేక్షకులు వస్తారా..! అని మేకర్స్ , ఇతర స్టార్స్ ఆలోచిస్తున్న తరుణంలో క్రాక్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. మంచి సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారని ప్రూవ్ చేవారు రవితేజ.
ఇప్పుడు వరుస సినిమాలతో మాస్ మహరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఖిలాడి ఈ ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతుంది. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంతో శరత్ మండవ అనే మరో డైరెక్టర్ను రవితేజ పరిచయం చేస్తుండటం విశేషం. ఈ రెండు చిత్రాలు కాకుండా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నారు. రీసెంట్గానే సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా షూటింగ్ను స్టార్ట్ చేశారు. దీని తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కమర్షియల్ సినిమాలకు కేరాఫ్కు అడ్రస్గా మారిన మాస్ మహారాజా రవితేజ. ఈయన ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుందాం...