18 October 2015
Hyderabad
ఆఖరి షెడ్యూల్లో `సాహసం శ్వాసగా సాగిపో`
నాగచైతన్య పేరు చెప్పగానే ముందు ` ఏమాయ చేసావె` సినిమా గుర్తుకొస్తుంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సినిమా అది. తమిళంలో శింబు నటించారు. ఇప్పుడు తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు హీరోలుగా మరలా గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో `అచ్చం ఎన్బదు మడమయడా` అనే పేరును ఖరారు చేశారు. తెలుగులో `సాహసం శ్వాసగా సాగిపో` అని టైటిల్ పెట్టారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. `ఏమాయచేసావె` తర్వాత నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ మీనన్, ఎ.ఆర్.రెహమాన్ కలిసి పని చేస్తున్న సినిమా ఇది. తెలుగులో ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మంజిమ మోహన్ కథా నాయికగా నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఎ గురు ఫిలిమ్స్ రూపొందిస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ ``నాగచైతన్య, గౌతమ్ మీనన్, రెహమాన్ కాంబినేషన్ తెలుగులో `ఏ మాయ చేసావె` పేరుతో ఎంత గొప్ప మాయ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్లో మా `సాహసం శ్వాసగా సాగిపో` రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టుగా ఉంటుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాగుతుంది. యాక్షన్ కూడా మేళవించి గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తప్పకుండా రీచ్ అవుతుంది. మలయాళ నటి మంజిమ మోహన్ను ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగులో పరిచయం చేస్తున్నాం. అక్టోబర్ 11 నుంచి ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఎ.ఆర్.రెహమాన్ వినసొంపైన బాణీలను ఇచ్చారు. వచ్చే నెల్లో పాటల్ని, డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు.
ఈ సినిమాకు సహ నిర్మాతలు: వెంకట్ సోమసుందరం, సునీత తాటి.