pizza

‘Sasanasabha’ Trailer released
సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

27 November 2022
Hyderabad

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని.. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16 గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తెలుగు ట్రైలర్‌ను ఏపీ మినిస్టర్ ఆర్.కె. రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి MLA డా. గాధరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు-నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను ‘నాంది’ సతీష్ విడుదల చేయగా.. టైటిల్ సాంగ్‌ను వైజాగ్ MLC వంశీకృష్ణ యాదవ్ విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖలు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు ట్రైలర్ విడుదల అనంతరం మినిస్టర్ రోజా మాట్లాడుతూ.. ‘‘శాసనసభ అనే టైటిల్ వినగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమాలలో పొలిటికల్ సీన్స్ వచ్చినప్పుడు శాసనసభని చూపిస్తారు. కానీ ఈ సినిమాకే ‘శాసనసభ’ అని టైటిల్ పెట్టడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను కూడా సినిమా నుంచే పాలిటిక్స్‌కి వచ్చాను. ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో ఇలా పొలిటికల్ సినిమా ఈవెంట్‌కు పిలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ వేడుకకు రావడానికి రెండు కారణాలు. ఒకటి కెజియఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్. కెజియఫ్ సినిమాకి ఆయన ఇచ్చిన సంగీతం మళ్లీ మళ్లీ ఆ సినిమాని చూడాలనిపించేలా చేస్తుంది. మ్యూజిక్కే ఆ సినిమాకి హీరోలాగా ఉంటుంది. మరొకరు మా షణ్ముగం. దాదాపు 13 సంవత్సరాలుగా అతను తెలుసు. నాకో బ్రదర్ లాంటివాడు. మీరు వస్తేనే ట్రైలర్ విడుదల చేస్తానని అనడంతో.. అంత అభిమానం, ప్రేమకి లొంగిపోయాను. శాసనసభలో ప్రస్తుతం సినిమా తరహా సీన్లే కనిపిస్తున్నాయి. ఏ లాంగ్వేజ్‌లో ట్రైలర్ చూసినా సేమ్ ఇంపాక్ట్ కలగడానికి అదే కారణం. ఇందులో మంచి మంచి ఆర్టిస్ట్‌లు ఉన్నారు. మా అందరికీ లక్కీ హీరో రాజేంద్ర ప్రసాద్‌గారు. ఆయనతో మొదటి సినిమా చేసిన వాళ్లందరం కూడా మంచి హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నాం. ఆయన ఎంత మంచి నటుడో అందరికీ తెలుసు. అలాంటి నటుడు ఒక మెయిన్ లీడ్‌లో.. కంటతడి పెట్టించబోతున్నారు. హీరో ఇంద్రసేనని చూసి.. సడెన్‌గా కెజియఫ్ హీరో వచ్చాడేమో అనుకున్నాను. చాలా చక్కగా ఇందులో ఆయన నటించారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజ్ కూడా ఇందులో చక్కగా కనిపిస్తున్నారు. సోనియా అగర్వాల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించినట్లుగా ట్రైలర్‌తో అర్థమైంది. హెబ్బా పటేల్ పబ్ సాంగ్‌లో కనిపించింది. ఈ ట్రైలర్‌లో రెండు డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. వీటి గురించి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కులం చూసి ఓటు వేసే రోజులు పోవాలి. మా వాడు, మా కులం అని చెప్పి ఓటు వేసి.. తర్వాత వాడు ఏం చేయలేదని బాధపడేకన్నా.. మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్లకి మంచి జరుగుతుంది. కాబట్టి కులం, మతం, ప్రాంతం అనేది పక్కన పెట్టండి. మీ ప్రాంతంలో ఎవరు నిలబడ్డారు.. వారిలో ఎవరు బెస్ట్? ఎవరికి మనం ఓటేస్తే మంచి చేస్తారు అనే ఆలోచనతో.. ప్రతి ఒక్కరినీ ఓటేయమని కోరుకుంటున్నాను. రెండోది.. ‘ఓటేసే రోజు మాత్రమే ఓటరు రాజురా.. ఆ తర్వాత 5 ఇయర్స్ మనమే రాజురా’ అంటారు. ఆ రోజులు పోయాయ్.. ఓటేసిన రోజు నుంచి.. మళ్లీ ఓటు వేసే రోజు వరకు ఎమ్మేల్యేలకి, ఎమ్‌పిలకి గడపగడపకి వెళ్లి.. మీకు ఏం ఇచ్చారు.. ప్రభుత్వం ఇచ్చినవన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవడమే కాకుండా.. ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ప్రతి రోజు తిరుగుతున్నామంటే.. ఇంతకు ముందులా పరిస్థితులు లేవని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మార్పు వచ్చింది.. దానికి తగ్గట్టే పొలిటికల్ లీడర్స్ కూడా మారాలి. సినిమా పరంగా ఈ రోజు మంచి ప్రొడ్యూసర్ దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది సినిమాలో నటించడానికి వెళ్లి, కంటెంట్ నచ్చి.. సినిమానే నిర్మించిన సప్పాని బ్రదర్స్‌కి కంగ్రాట్స్. డిసెంబర్ 16న వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.

కన్నడ ట్రైలర్ విడుదల చేసిన తుంగతుర్తి MLA గాధరి కిషోర్ మాట్లాడుతూ.. ‘‘నా స్నేహితుడు ఇంద్రసేనకు శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల నుండి ఇద్దరం.. తను సినిమాలలో, నేను పాలిటిక్స్‌లో స్ట్రగుల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొవడంతో పాటు.. ఆ తర్వాత రెండుసార్లు శాసనసభకు ఎంపికయ్యారు. ఇప్పుడు నేను ‘శాసనసభ’లోనే ఉన్నాను. ఇంద్రసేన సినిమాలలో ఉండి.. ‘శాసనసభ’లో ఏం జరుగుతుందో చూపిస్తానంటున్నాడు. ట్రైలర్ చూశాను.. అద్భుతంగా ఉంది. సినిమాలో మమ్మల్ని ఎలా చూపిస్తారో చూడాలి. ‘శాసనసభ’ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 16 నా పుట్టినరోజు. ఆ రోజు విడుదలవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాను’’ అన్నారు.

తమిళ ట్రైలర్ విడుదల చేసిన అనంతరం ‘నాంది’ సతీష్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర దర్శకుడు వేణు మడికంటి.. నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. మేమిద్దరం ఓ ప్రాజెక్ట్‌కి కూడా వర్క్ చేశాం. అతనికి, రచయిత రాఘవేంద్రరెడ్డిగారికి, టీమ్‌కి ఆల్ ద బెస్ట్. ఇప్పటికే పోస్టర్స్ చూశాను. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇంటెన్స్ ఫిల్మ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా విడుదలవుతున్న అన్ని భాషలలో గొప్ప విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను..’’ అని తెలిపారు.

మలయాళం ట్రైలర్ విడుదల చేసిన అనంతరం దర్శకుడు, నటుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వేణు నా దగ్గర ‘వీడు తేడా’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నేను ఇలాగే ఉన్నాను.. అతనిప్పుడు పాన్ ఇండియా దర్శకుడు అయ్యాడు. శాటిలైట్ రాఘవేంద్రరావు అనేవారు.. ఇప్పుడేమో రచయిత రాఘవేంద్రరెడ్డి అంటున్నారు. వేణుకి గొప్ప అవకాశం ఇచ్చిన ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ శాసనసభ కళగా ఉండాలంటే రోజాగారు ఉండాలి.. అలాగే ఈ శాసనసభకి కూడా రోజాగారు రావడంతో కళ వచ్చేసింది. ఈ వేడుకకు వచ్చిన రాజకీయ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

చిత్రంలోని మూడో పాటైన టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన వైజాగ్ MLC వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘శాసనసభ ట్రైలర్ లాంచ్ వేడుకకు వచ్చిన మంత్రివర్యులు రోజాగారికి, ఇతర రాజకీయ ప్రముఖులకు ధన్యవాదాలు. ఒక అద్భుతమైన సినిమా తీసిన మా సోదరులు తులసి, షణ్ముగంగారికి ధన్యవాదాలు. ముందు ముందు ఇంత కంటే మంచి సినిమాలు తీసే విధంగా అందరి సపోర్ట్ వారికి ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి రవి బస్రూర్‌గారు. ఆయనకు ఇంకా మరిన్ని మంచి విజయాలు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.

‘చోర్ బజార్’ చిత్ర నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ..‘‘ఈ వేడుకకి విచ్చేసిన రోజాగారికి, వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి.. ఇంకా రాజకీయ ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ మూవీ రచయిత రాఘవేంద్ర రెడ్డిగారు నా ఆప్తమిత్రులు. ఒక సినిమా చేయాలి అనుకుంటున్నప్పుడు ‘వెంకటాపురం’ అనే సినిమా చేసిన వేణుని పరిచయం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రం ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది. రవిబస్రూర్‌గారికి నేను పెద్ద అభిమానిని. ‘ఉగ్రం’, ‘కెజియఫ్’, ‘సలార్’ రేంజ్‌కి ఈ సినిమా కూడా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. హీరో ఇంద్రసేనకు, ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్..’’ అని అన్నారు.

దర్శకుడు, నటుడు అనిష్ కురివిల్లా మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. అస్సలు ఊహించలేదు ఇలా ఉంటుందని. మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర.. నా కెరీర్‌లోనే చాలా ముఖ్యమైనది. ఈ పాత్ర చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఆలోచిస్తాడు? ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు? వంటివన్నీ నా పాత్రలో ఉంటాయి. ఈ పాత్ర చేసినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వేణు వండర్‌ఫుల్ జాబ్. తెలుగు ట్రైలర్ చూసినప్పటి నుంచి నేను క్లాప్స్ కొడుతూనే ఉన్నాను. ఇది ఎంటర్‌టైనింగ్ పొలిటికల్ థ్రిల్లర్. ప్రేక్షకులందరూ ఈ సినిమాతో ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 16ను మార్క్ చేసి పెట్టుకోండి.. థ్యాంక్స్’’ అని అన్నారు.

‘శాసనసభ’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ‘శాసనసభ’ ట్రైలర్ లాంచ్ వేడుకకు విచ్చేసిన రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొలిటికల్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభమై.. ఆ తర్వాత సినీ జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, శాటిలైట్ అండ్ డిజిటల్ కన్సల్టెంట్‌గా, నిర్మాతగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించాను. ఈ ప్రయాణంలో నాకు మంచి మిత్రుడుగా జత కలిశాడు హీరో ఇంద్రసేన. ఆయనకు సరైన బ్రేక్‌ని ఇవ్వాలని, ఆయన కోసమే రాసిన కథ ఇది. ఆయన అద్భుతంగా ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లారు. నిర్మాతలు తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ సినిమాని ఒక లెవల్‌కి తీసుకెళ్లారు. రవిబస్రూర్‌గా ఈ సినిమాలోకి ఎంటరవడంతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లొసుగులపై సంధించిన చిన్న సైజు పాశుపతాస్త్రం ఈ సినిమా. అలా అని ఇందులో ఎవరినీ కించపరచలేదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్నింటిని చర్చించాం అంతే. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ప్రస్తుతం ఎన్నికల హడావుడి కూడా నడుస్తుంది కాబట్టి.. కరెక్ట్ సమయంలోనే సినిమాని విడుదల చేస్తున్నామని భావిస్తున్నాం. డైరెక్టర్ వేణు ఈ సినిమా కోసం మంచి ఎఫర్ట్ పెట్టారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అన్నారు.

చిత్ర దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఈ వేడుకకు వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన రోజాగారికి, ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించాం. నేను ఈ సినిమా చేయడానికి కారణమైన సురేష్ వర్మగారు, చిన్నికృష్ణగారికి స్పెషల్ థ్యాంక్స్. రాఘవేంద్ర రెడ్డిగారి దగ్గర ఉన్న కథకి నన్ను వాళ్లు సజెస్ట్ చేశారు. నా మొదటి సినిమాకి అచ్చు రాజమణి పనిచేశారు. రెండో సినిమాకి ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌తో వర్క్ చేస్తానని ఊహించలేదు. ఈ విషయంలో నిర్మాతలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమాకి మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఇంద్రసేనని యాక్షన్ హీరోగా ఇందులో కనిపిస్తారు. ఆయనకి ఈ సినిమా చాలా మంచి పేరుని తీసుకువస్తుంది. మంచి యాక్షన్ హీరో అవుతాడు. ఇది నేను చెప్పడం కాదు.. డిసెంబర్ 16న సినిమా చూసి మీరే చెబుతారు. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమా విడుదల తర్వాత ‘శాసనసభ’లో జరిగేదాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. నారాయణస్వామిగా ఆయన ఇందులో చేశారు. ‘ఆ నలుగురు’ సినిమా తర్వాత ఆయనకి మళ్లీ అలాంటి పేరుని తీసుకువచ్చే పాత్రని ఇందులో చేశారు. మంచి సినిమా ఇది.. ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ సో మచ్’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మాతలకు సినిమా అంటే ఎంతో అభిమానం. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నా దృష్టిలో చిన్న, పెద్ద అనే సినిమా లేదు. ప్రతి సినిమాకి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాకు కూడా అదే చేశాను. నా మ్యూజిక్‌పై ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాలాగే చాలా మంది సంగీత దర్శకులు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశానికి ధన్యవాదాలు.. థ్యాంక్యూ’’ అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన తులసీ రామ్ మాట్లాడుతూ..‘‘మా ‘శాసనసభ’ చిత్ర ట్రైలర్ వేడుకకు వచ్చి, మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్కారాలు. మంచి సబ్జెక్ట్‌తో, మంచి కమిట్‌మెంట్‌తో ఒక సినిమా తీశాం. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

మరో నిర్మాత షణ్ముఖం మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకకు నా తరపున, డైరెక్టర్‌గారి తరపున, హీరోగారి తరపున అతిథులుగా విచ్చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. 2018లో ఒక సినిమా చేయాలని ఈ బ్యానర్ రిజిస్టర్ చేశాం. దాదాపు 5 సంవత్సరాలుగా కథలు వింటున్నాను. ఫస్ట్ ఈ ‘శాసనసభ’ అనే సినిమాలో నేను యాక్ట్ చేయడానికి వెళ్ళాను. ఈ సినిమాలో శివ సంగిరెడ్డి అనే నా స్నేహితుడు నటిస్తున్నాడు. అతని ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకున్నాను. టైటిల్, కంటెంట్‌ నాకు బాగా నచ్చడంతో.. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేయండి అని అడగగానే ఇచ్చేసిన ఇంద్రసేనకు, జగదీశ్వర్ రెడ్డికి, రాఘవేంద్ర రెడ్డికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే.. నేను దేని కోసం అయితే చూస్తున్నానో.. అలాంటి ప్రాజెక్ట్‌తో లాంచ్ అయ్యేలా చేసినందుకు. ఈ సినిమాకి ఇంద్రసేన మొదటి హీరో అయితే.. రవి బస్రూర్‌గారు రెండో హీరో. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ఆయనని కలిసినప్పుడు.. ఆయన ఒక్కటే చెప్పారు. నాకు చిన్న, పెద్ద తేడా ఏమీ ఉండదు సార్. మేము ఒకప్పుడూ స్ట్రగుల్ అనుభవించాము. గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా.. 1ని 1 అనే రాస్తారు సార్ అన్నాడు. ఆ రోజు నుంచి ఆయనతో ట్రావెల్ అయ్యాను. లిరిక్స్ కూడా ఆయన టీమే చూసుకున్నారు. ప్రతి పాట అద్భుతం. ఈ చిత్ర హీరో నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నేను కంటెంట్‌ని నమ్మాను. నాకు ప్రతి నిర్ణయంలో సపోర్ట్ ఇచ్చిన మా మదర్‌కి, నా బ్రదర్‌కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఈ శాసనసభను ఆశీర్వదించడానికి వచ్చిన మా రోజాగారికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్’’ అని అన్నారు.

హీరో ఇంద్రసేన మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి వచ్చి.. మా టీమ్‌ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. శాసనసభ.. చాలా వెయిట్ ఉన్న టైటిల్. స్ట్రాంగ్ టైటిల్. ఈ టైటిల్‌కి రవి బస్రూర్ సార్ ప్రాణం పోశారు. ఈ సినిమా గురించి మేము ఇంత బిగ్గరగా మాట్లాడడానికి కారణం ఆయనే. ఒక కొత్త హీరోకి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం ఎవరి వల్ల కాదు.. మా నిర్మాతల డేర్ చేశారు. 5 లాంగ్వేజ్‌లలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 16న సినిమాని విడుదల చేస్తున్నారు. ఒక స్టార్ హీరోకి ఇచ్చే కథని నాకు ఇచ్చిన రాఘవేంద్ర రెడ్డి అన్నకి థ్యాంక్స్. అద్భుతంగా సినిమాని తీసిన మా డైరెక్టర్ వేణు గారికి థ్యాంక్స్. సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులకు, ఇతర నటీనటులకు థ్యాంక్యూ సో మచ్. మాలాంటి కొత్తవారిని ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లే మీడియా సోదరులందరికీ థ్యాంక్స్ చెబుతూ.. ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకువెళ్లాల్సిందిగా వారిని కోరుతున్నాను. థ్యాంక్యూ సో మచ్ టు ఆల్’’ అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నాగార్జున యాదవ్ (నిర్మాత షణ్ముగం సోదరుడు), విరాట్ రాజ్, హీరోయిన్ ఐశ్వర్య రాజ్ వంటి వారంతా మాట్లాడుతూ.. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved