14 June 2017
Hyderabad
భుజానికి గౌరవప్రదంగా వేళ్ళాడే తెల్ల కండువాను కంఠాభరణం చేసుకుని, మచ్చలేని ఖద్దరు పంచను ఒక చేత బిగ పట్టి, వసివాడని లాల్చీని వదులుగా తొడిగి, సంస్కారానికి ఎప్పుడూ చుక్కెదురయ్యే సంస్కృతి ఈదురుగాలలకు ఎదురొడ్డి నిలిచి, వంకీల జులపాలు రెప రెపలాడి పోతున్నా, వంటికి చుట్టిన బట్టని ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నా, చెదరని చిరునవ్వుతో, గుండెల నిండిన ఆత్మ విశ్వాసంతో, ప్రపంచానికి పదం పటుత్వం చాటిచెప్పిన కవితా పురుషుడు వాడు. కావ్య కన్యకకు ఉన్న అందం, ఒద్దిక, సౌకుమార్యం, లాలిత్యం అన్నీ ఒక పక్క ఇముడ్చుకునే, ధీరోధాత్తుని కుండే గాంభీర్యం, మొక్కవోనితనం, ధైర్యం, విచక్షణల లక్షణాలతో మేరునగధీరుడిలా నిలుచున్న పద పురుషుడు వాడు. పొగరుగా ఉన్నాడా? ఎందుకుండ కూడదు? మిడిసిపడుతున్నాడా? ఎందుకు పడకూడదు? తెచ్చిపెట్టుకున్న వినయంతో తడిసి ముద్దయినట్టు లేడా? నిండా తడిసినా చిన్న కొమ్మ కూడా కదలని వటవృక్షాన్ని చూడు. వాక్కు తోడుంటే, దాని పలుకుబడిలో పస ఉంటే, మంచి మాట మాత్రమే మాట్లాడగలిగే నిబద్ధత ఉంటే - విద్వాన్ సర్వత్ర పూజ్యతే! తరాలు మారినా, కాలాలు మారినా, అభిరుచులు మారినా, వినేవారు మారినా, రాయమనేవారు మారినా, ఆ పదాని కుండే పదును తగ్గలేదు, ఆ పదాన్ని దూసే వేడి/వాడి తరగలేదు, ఆ పదాన్ని తిరిగి గౌరవంగా పొందుపరిచిన ఒర మారలేదు, వెరసి, ఆ ఒరవడీ మారలేదు. కాలానికి అతీతంగా నిలిచేది ప్రాకృతిక నియమం ఒక్కటే అని వాదిస్తుంది శాస్త్రం. కాదోయ్, నిబద్ధత కూడా కాలానికి లొంగని బేరమే అని ౠజువు చేసింది ఆ కవితా పురుషుడి పద విన్యాసం. 'అయ్యా! జనాలు ఉర్రూతలూగి పోయే హలం నృత్యం, అభినయం, మషాలా నషాళానికి అంటాలి మన పాటలో ' అన్నప్పుడు కూడా, 'మాయదారి సిన్నోడు, మనసే లాగేసిండు ' అని మాటకి మర్యాదని చుట్టి, అశ్లీలాన్ని ఆరామడల దూరంలోనే నిస్సంకోచంగా పెట్టిన నిస్సంగి ఆ కవితా పురుషుడు.
సినారె తమ వాడు అని చెప్పుకునేందుకు సాహిత్య విభాగాలు పోటీ పడతాయి. గుజ్జనగూళ్ళు, కోతికొమ్మచ్చులాడుకునే వయసులో ఛందస్సులూ, యతి ప్రాసలంటూ భాష బాటపట్టి, కలం కదం తొక్కించడం మొదలుపెట్టి, కవిత్వం పని పట్టాడు కాబట్టి, ఆయనది కవికులం అని అక్కున చేర్చుకుంటుంది ఆ సంక్షిప్త సమాజం. నైజాం హజం పుణ్యమా అని తెలుగు గడ్డ మీద ఉర్దు పట్లు, పాట్లు, మెలికలు, మెలకువలు వంటపట్టించుకుని, తెలుగు భాషకు గజళ్ళ గాజులు తొడిగి, భావానికి భాషా హద్దులు చెరిపిన ఉభయ కవి మిత్రుడు. కవిత్వం అనేది వ్యాపకం కాదు లక్షణం అంటూ చివరి రోజుల వరకూ ప్రతి యేట కవితా సంకలనాలను క్రమం తప్పక వెలువరించిన సహజ పాండిత్యుడు. ఇక సినీ వినీలాకాశంలో తను అడుగుపెట్టే సమయానికే విరాజిల్లుతున్న తారా తోరణం నడుమ, తనకంటూ ఒక విశిష్ట స్థానం సృజించుకున్న/సృష్టించుకున్న సినీ సాహిత్య ధృవ తార. తక్కిన కవులు (దేవులప్పలి, శ్రీ శ్రీ తక్క) సందర్భాన్ని బట్టి, వత్తిళ్ళకు లొంగి తమ మాటని అక్కడక్కడా తూలించినా, తూలే సందర్భానికి కూడా ఠీవైన పదజాలం వాడడం సినారె సొంతం. డిండిమభట్టు కంచు ఢక్కా పగలకొట్టిన శ్రీనాధుడు తనకు ఆదర్శం అని చెప్పుకున్న సినారె, 'దివిజ కవివరుల్ గుండియల్ డిగ్గురనగ అరుగుచున్నడు శ్రీనాథు డమరపురికి ' అని తుదిశ్వాసలో కూడా ఆభిజాత్యం, ఆత్మవిశ్వాసము విడనాడని ఆ కవిరాజు బాటనే, రాసే చివరి పంక్తి వరకు, పాటవరకు, కవిత వరకు, తను ఏర్పరుచుకున్న స్థాయిని, నెలకొల్పుకున్న ప్రమాణాలనీ ఏ కారణానికైనా ఒక్క మెట్టైనా దింపని అభినవ శ్రీనాధుడు సినారె. బహుశా, అందుకనే గాంభీర్యం స్ఫురించగానే దర్శక నిర్మాతలకూ, ప్రేక్షకులకూ ఠక్కున గుర్తుకు వచ్చే స్ఫురద్రూపం సినారె. రాధేయుడైనా, గాధేయుడైనా, కురురాజైనా, సురరాజైనా, మాట తొణికింది లేదు, భావం బెసికింది కాదు. ('ధన్య గాంధారి గర్భ శుక్తి ముక్తా ఫలా, మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజః ఫలా')
'నీ స్థాయికి నా సాహిత్యాన్ని దించను, కావాలంటే నన్ను అందుకోవడానికి నువ్వే ఎదుగు ' అన్నది సామాన్యులకు కొరుకుడుపడదను తన కవితా శైలి పై విమర్శకి కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయాణ దీటైన జవాబు. పరిణామ క్రమంలో మనిషి పరమార్ధం వైపు అడుగులు వేయాలన్నది జీవిత సత్యం అనుకుంటే, సినీ జగతిలో మాత్రం ఆ సూత్రం తిరగబడుతుంది, ఎదిగిన కొద్దీ, యేళ్ళు గడిచిన కొద్దీ విరాట్ రూపం పొందాల్సింది పోయి సినీ స్థాయి వాలఖిల్యుల పరిమాణంలో పరిణామ వ్యతిరేక దిశలో కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితులలో కూడా, ఒకానొక నాయుకుడి స్త్రోత్ర గీతంలో 'ఆ పాదం కదిపితే తేజోవలయం తీండ్రిస్తుంది ' అని సూర్య ప్రకాశాంతో పొలుస్తూ వాడిన ఆ పద గాంభీర్యం సినారె ప్రౌఢత్వానికి ప్రతీక. అర్ధం కాని వాళ్ళు అనురక్తి ఉంటే ఎలాగైనా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు అన్నది తన ప్రయోగం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్న కవి నమ్మకం. 'ప్రళయ కాల సంకలిత భయంకర, జలదరార్భటుల, చలిత దిక్దటుల, చకిత దిక్కరుల, వికృత ఘీంకృతుల, సహస్ర ఫణ సంచలిత ఫూకృతుల ' అన్న ప్రయోగం అంగజుడిని అంతమొందిచాక తపోభంగమైన శివుడి తాండవ వర్ణన, కావ్యమూ కాదు, కవిత కోసమూ కాదు, మాధ్యమం జన సామాన్యమైనది అని తెలిసికుడా సాహసించడం, ఆ పైన మెప్పించడం అన్నది కేవలం కవి యొక్క ప్రఙ్ఞ కాదు, ఆ సందర్భానికి ఆ మాటల ఔచిత్యం అతని విచక్షణకూ, రాసినదాన్ని ఒప్పించడం అన్నది ఆ ప్రయోగం పై తనకున్న నమ్మకాన్ని తెలియచేస్తుంది. అందుకనే సినారె పాటలు తెలుగు సినీ సాహిత్యానికి గీటురాళ్ళుగా నిలిచాయి. మనిషి గతించి పోయినా మాట నిలిచిపోతుంది, అందునా అటువంటి మాట ఒక సంస్కృతికే మార్గదర్శకంగా నిలిస్తే.... ఆ జీవితం చరిత్ర అవుతుంది, ఆ జన్మ చరితార్ధమవుతుంది.
by Srinivas Kanchibhotla
checkout http://kanchib.blogspot.com for Srinivas's Blog